సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, డిసెంబర్ 2012, ఆదివారం

ముక్కోటి దేవతా మూర్తీ ! శ్రీ సాయి నాథా !

శేష నగము జేరి చెలు వార కొలువైన
వేంకటేశ్వరుడవు వెలయ మాకు
కలల పంటవైన యిల వేల్పు నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

తిరుమ లేశు నెదను దీటు గా కొలువైన
అమ్మ- త్రిభువనాల కండ దండ
పరమ సాధ్వి యైన పద్మావతియె నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

తాను విశ్వ మందు తన యందు విశ్వమ్ము
" తామరాకు నీరు " తనరు భంగి
వెలయు విష్ణు రూప ! విశ్వావనీ నాధ !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

పసిడికి నిలువెల్ల భాసురంబగు కొల్వు
శ్రీకరముల నెలవు చిత్త మెల్ల
సిరులు రూపు దాల్చు శ్రీలక్ష్మి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

సకల శుభము లిచ్చి సాయుజ్యముల నిచ్చి
సగము తనువునిచ్చి సత్కరించు
భక్త సులభు డైన పరమేశ్వరుడ వీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

అరయ ప్రాణికోటి కాహార మిచ్చేటి
అమ్మ – త్రిభువనముల కన్న పూర్ణ
సర్వ మంగళ , శుభ , శర్వాణి యే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

విశ్వ స్రస్ట తాను విశ్వమ్ము సృజియించి
మొదలి జన్మలరసి విధి లిఖించె
బ్రహ్మ నీవె పరమ బ్రహ్మమ్ము నీవెరా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

వరలు దేహమెల్ల వాగర్ధ విభవమ్ము
భావ సంపదల ప్రభావ మయము
ఎరుక రూపు దాల్చు పర శారదే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

రామ నామ మధుర రస ధార సేవనా
నంద మహిమ లెన్న నాతరంబె
సాయి రాము డనగ సర్వోన్నతుడ వీవె
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

శ్రీ రాము పత్ని , జనకజ ,
గారాముల భూమి పుత్రి , కమనీయ ,దయా
వారాశి , సీత నీవయి
కారుణ్య రసాబ్ధి దేల్చి కావర సాయీ !

శ్రీరాము బంటు , అంజని
గారాముల కూర్మి సుతుడు , కరుణాంబుధి , మా
కారాధ్యు డైన మారుతి
నీరూపున గాంచు వరము నియ్యర సాయీ !

పూర్వాద్రి రూప ! పశ్చిమ
పర్వత రూపాయ ! తే నమామి – యటంచున్
సర్వేశుడవగు దినకరు
సర్వోన్నత మూర్తి ! నీకు సన్నుతి సాయీ !

తివిరి భూజనులకు దేదీప్య మానమై
వెలుగునిచ్చి బ్రోచు వేద వేద్య !
తిమిర సంహరణకు దీప్తి నీవేనురా !
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

చలన రధము నీవు సారధి యును నీవు
కొదమ గుర్రములును రధియు నీవు
చరమ పధము నీవు చైతన్యమే నీవు
శ్రీని వాస సాయి ! శిరిడిరాజ !

మదిని నిన్ను బెట్టి మొదలిడి నట్టి యే
కార్య మైన సఫల కారియగును
యింత కన్న జనులు యేమి కోరేరు రా
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

15, డిసెంబర్ 2012, శనివారం

తెలుగు - వెలుగు


                          నలు చెఱంగుల తెలుగుల నాల్క లందు

                          తెలుగు వెలుగులు వెల్లువై – తెలుగు బాష

                          తేజ రిల్లును గాత  !  సందియము లేదు ,

                          మాతృ భాషకు వందన మాచ రింతు .

 

          దక్షిణ భారతీయ భాషలలో తెలుగు మథురమైన భాష . సంస్కృతంతో మిక్కుటముగా మమేకమై తెలుగు

దక్షిణాది భాషల కంటే విలక్షణమై భాసిల్లుతూ ఉంది .

          పద , వాక్య నిర్మాణాది భాషా లక్షణాలలో తన సహజ సౌరభాన్ని నిల్పుకుంటూనే సంస్కృతం , ఉర్దూ ,

ఆంగ్ల పదజాలంతో పరి పుష్టమై వికసిస్తూ , నిరంతరం భాషా స్రవంతిగా కొన సాగుతూనే ఉంది .

          పద నిర్మాణంలో తనకు మాత్రమే సొంతమైన అజంత మాథుర్యాన్ని తనలో కలగలసిన పరభాషా పదజాలానికి కూడా అద్ది , సుమథుర రుచిరం గావిస్తున్న తెలుగు భాష సహజ సౌందర్యం కొనియాడ దగినది .

         తెలుగు బ్రష్టు పట్టి పోతోంది . కను మరు గయ్యే ప్రమాదం ఉంది . ఉధ్ధరించ వలసి ఉంది . “ – ఇలాంటి మాటలు ఈమథ్య తరచుగా విన వస్తున్నవి .  ఈ నెల ఇరవయ్యొకటిన ప్రపంచం అంత మవుతుందన్న అసంబధ్ధ

జ్యోతిషాలలో వాస్తవం లేనట్లే పై మాటలలో కూడా నిజం లేదు .

            తల్లి భాషలో భావ వ్యక్తీ కరణ సుళువుగానూ విస్పష్టంగానూ ఉంటుందనడంలో సందేహం లేదు . నేడు

మనం మాటాడే తెలుగులో సంస్కృత పదజాలం ఎక్కువ . తెలుగేదో సంస్కృత మేదో గుర్తించ లేనంతగా కలగలసి

తెలుగు భాష కొన సాగుతూ ఉంది .

             సంస్కృత భాషా ప్రభావం మన భాషపై ఎక్కువ . ఒక విథంగా తెలుగు పరి పుష్టం గావడానికి ఈ ప్రభావం దోహదం చేసింది . ఐనా , ఇప్పుడు మనం మాటాడే సంస్కృత పదానికి అర్థంలో సరి తూగే తొలి తెలుగు

పదాలు ఈ ప్రభావం వల్ల వాడుక నుండి తప్పుకున్నవి . కారణం , మన పండితులకూ కవులకూ పండిత – కవి పోషకులకూ సంస్కృతం మీద ఉన్న మక్కువ . ఈ మక్కువ వల్ల తుదకు తెలుగు పేర్లు కూడా సంస్కృతీకరింప బడి , అసలేదో కొసరేదో గుర్తించ లేని స్థితి ఏర్పడింది . ఇది కొంత వరకు తెలుగు భాషకు ఇబ్బంది తెచ్చింది .

              తెలుగు కవులలో తిక్కన , వేమన , గురజాడ లాంటి కవులు కొంత మంది – కృష్ణ రాయలు , రఘునాథ – విజయ రాఘవ నాయకుల లాంటి కొంత మంది కవి పోషకులు తెలుగుపై మమకారంతో ఆనాటి

వాడుక లోని తెలుగు మాటలను తమ రచనలలో సింహ భాగం వాడి తెలుగు వెలుగులు విర జిమ్మినారు .

వారికి తెలుగు జాతి సదా ఋణ పడి ఉంటుంది .

               గ్రామీణుల నోళ్ళలో  నేటికీ తొలినాటి తెలుగు పదాలు వాడుకలో ఉన్నవి . పుట్టుకకు దగ్గరగా , ఎక్కువ మార్పులకు లోనుగాకుండా , పరిపూర్ణ భావ వ్యక్తీ కరణ సమర్థత గల్గి జాన పదుల నోళ్ళలో నేటికీ

ప్రాచీన తెలుగు పదజాలం అలరారుతూ ఉంది .

                కానీ , మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పండితులూ కవులూ వీటిని గ్రామ్యాలంటారు . అసాథువు లని పేరు పెడుతారు . వ్యాకరణ విరుధ్ధాలని కొట్టి పారేస్తారు . మాటాడుటకు తప్ప రచనలో వినియోగించుట నేర మంటారు .

                దరిమిలా , మనకు గ్రాంథికం – వ్యావహారికం అనే రెండు సమాంతర భాషలు ఏర్పడ్డవి . ఏమిటో  మరి ! సహజ సౌందర్యం ఉట్టి పడే గ్రామీణ తెలుగు పదాలు పండితులకు పంటి కింద రాయిలా బాధిస్తుండడం చూస్తే మన నెత్తిన సంస్కృత ప్రభావం ఎంత ఎక్కు పడిందో తెలుస్తోంది కదా !  

                  ఇంతకీ నేను విన్న వించు కునే దేమిటంటే ,  తెలుగా , సంస్కృతమా , ఉర్దూనా , ఇంగ్లీషా తదితరమా  అనే తేడా మానుకొని  తెలుగు మాటాడే టప్పుడు గాని , వ్రాసే టప్పుడు గాని  -

భావాన్ని విస్పష్టంగా వ్యక్తీకరించడానికి  తెలుగు వాడుకలో కలగలసి పోయిన  అత్యంత సమర్థ మంతమైన  

ఏ పదాన్నయినా వాడండి . తెలుగు భాషను పరి పుష్టం చేయండి .

                భాష పరిణామ శీలి . నిరంతర శ్రోతస్విని . దీన్ని గుర్తించిన వారు భాషా వికాసానికి తోడ్పడి నట్లే .

మడి కట్టు కున్న వారు తెలుగు చెడిపోతుందన్న బ్రమలో పడి భాషకు తామెంత నష్టం చేస్తున్నారో ఎన్నటికీ గ్రహించ లేరు .

                 జన బాహుళ్యం నాలుకల మీద నాట్యమాడే ఏ భాషా అంతరించదు .

                 పిడికెడు మంది పండితుల వ్యవహారంలోని భాష లెప్పుడూ మనుగడ సాగించిన దాఖలాలు లేవు .

 

 

                 

23, నవంబర్ 2012, శుక్రవారం

గ్రామీణ భారతంలో విద్యా దురవస్థ


                                                                                                                                                                ఒకప్పుడు విద్యాభ్యసనానికి ప్రభుత్వ పాఠశాలలే శర ణ్యం  .   సామాజిక అంతరాల హెచ్చుతగ్గులకు అస్కారంలేని చదువులుండేవి  .
ధనవంతుడికొడుకైనా పేదవాడికొడుకైనా ఒకేపాఠశాలలోచదివేవారు.   దీనివల్ల అంతరాలలోకూడా సఖ్యత ఏర్పడి సామాజిక సమతుల్యతకు దోహదం కలిగేది  .   ప్రస్తుతవిద్యలో ప్రైవేటు భాగస్వామ్యం విస్తరించిన దరిమలా   ధన వంతులస్కూల్లూ, పేదలస్కూల్లూ(ప్రభుత్వపాఠశాలలు)ఏర్పడ్డాయి .                                                    
 
ధనికుడు ధనాధికుడుగానూ , పేద నిరుపేదగానూ స్థిరం అయ్యేపరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం పదిశాతం ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నాయి .  మిగతా తొంభైశాతం విద్యావ్యాపారాలుచేస్తూ అక్రమమార్గాలలో అవాంఛిత పోటీ సృస్టిస్తున్నాయి . ప్రభుత్వ పాఠశాలల ఎన్రోల్మెంటు పడిపోయి , కొనసాగించాల్నా వద్దా అనేస్థితికి చేరుకొన్నాయి . దీనికికారణాలుగా  1 . ప్రభుత్వాల నిర్లక్ష్యం  2.ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం   3.తల్లిదండ్రులనిరాసక్తత , నిరక్షరాస్యత 4.విద్యార్థులను విద్యాసక్తులనుచేసే మెకానిజంలేకపోవడం మున్నగు వాటిని ప్రముఖంగా చెప్పుకో వచ్చు .                    
 
బాధ్యతవహించవలసినవారంతా నిర్లక్ష్యం వహిస్తున్నపాపానికి చిన్నారులు చదువుకు స్వస్థిచెప్పి శిక్షననుభవిస్తున్నారు . వివిధతరగతుల స్థాయులలో ఇరవైశాతం కూడా ప్రమాణాలు  సాధించినవారులేరంటే మనపాఠశాలలస్థాయి ఏపాటిదో ఊహించవచ్చు . ప్రతివారూ బాధ్యతల నుంచి తప్పించుకొని  పైపెచ్చు ప్రమాణాలగ్రాఫులు పెంచుకోవడానికి అక్రమమార్గాలను ప్రోత్సహించడం చూస్తుంటే విద్యలొ విపరీతధోరణులు ఎంత దూరం వెళ్తాయో! !
 
ప్రభుత్వపాఠశాలలు నిర్వీర్యం కావడానికి ఉపాధ్యాయులుకూడా కొంతవరకూ కారణమే
 
ప్రభుత్వపాఠశాలలు నిర్వీర్యం కావడానికి అందులో     
పనిచేస్తున్న ఉపాధ్యాయులుకూడా కొంత కారణం అనక తప్పదు . నాటి
ఉపాధ్యాయునికి నేటి ఉపాధ్యాయునికి అనేక అంశాలలో తేడా ఉన్న మాట వాస్తవం
లక్ష్యశుధ్ధి లో గాని , విద్యాబోధనలోగాని , "రోల్ మోడల్"గా
మార్గదర్శకత్వంవహించడంలో గాని    నేటితరం  ఏ అంశంలోనూ పోల్చడానికి సాహచించ
లేము.
నాటి ఉపాధ్యాయునికి తన వృత్తిపరమైన ధ్యాస తప్ప
వేరే వ్యాపకాలు లేవు . కాబట్టి మార్గ దర్శకుడిగా సమాజంచేత పూజింప బడినాడు.
అందుకే నాటి ఉపాధ్యాయుడు " గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో
మహేశ్వర: " .
నేటి ఉపాధ్యాయుడికి అంతటి ఓపికా లేదు. అంతటి
తీరికా లేదు . నిర్దేశిత టీచర్ ట్రయినింగులలో , పోటీ పరీక్షలలో నెగ్గి
ఉద్యోగంలో ప్రవేసించడంతోనే తన శక్తి యుక్తులకు ఫుల్ స్టాప్
పెట్టేస్తున్నాడు .
ట్రైనింగులో తాను నేర్చుకొన్న బోధనా పధ్ధతులు,
కృత్యాలు అక్కడే వదిలేసి వస్తున్నాడు . తరగతి గది లోకి ప్రవేసించ డానికి
ముందు సమగ్రమైన ప్రిపరేషన్ అవసరం . ఎన్నో సమ కూర్చు కోవాలి . అందుకు ఎంతో
సమయం వెచ్చించాలి . తరగతి గది లో పాటించ వలసిన తీరు తెన్నులు అనగా
ఆహార్యంలోగాని , మాట తీరులోగాని , మర్యాదలు పాటించడంలోగాని ఎంతో ఓపిక అవసరం .
విద్యార్ధులు తమ ఉపాధ్యాయుణ్ణి రోల్ మోడల్ గా భావిస్తారు .
నేటిఉపాధ్యాయుడు ఈవిషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు . ఫలితంగా విద్యార్ధి
తప్పు దారిపడుతున్నాడు. అస్తవ్యస్త సమాజం దాపురిస్తూవుంది . ఈకారణంగానే
ఉపాధ్యాయ వృత్తి గురుతర బాధ్యయతలతో నిండిన ,  సమాజానికి బాధ్యత వహించవలసిన
వృత్తి గా భావింప బడుతూ ఉంది .
ఉపాధ్యాయులలో వృత్తిపరమైన డెడికేషన్ లేకపోవడం,
విద్యావిధానంలో అకౌంటబిలిటీ లోపించడం , వృత్తి లో కొలమానాలు
నిర్దేశించకపోవడం , శాఖాపరమైన తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహించ బడడం ,
ఇక ముఖ్యంగా ఉపాధ్యాయులు ఇతర ఆదాయ వనరులను విరివిగా నిర్వహిస్తూ
ఈవృత్తిని ఉపవృత్తిగా భావించడం చూస్తూవుంటే   నేటిప్రభుత్వ పాఠశాలల
నిర్వీర్యానికి ఉపాధ్యాయులు కూడా కొంత మేర కారణంగా భావించడంలో తప్పులేదు.
ప్రభుత్వ ఉపాధ్యాయులలో ఏ ఒక్కరూ తమ బిడ్డలను
ప్రభుత్వ పాఠశాలలలో చదివించడానికిఇష్టపడడం లేదంటే ప్రభుత్వ పాఠశాలలు
అందిస్తున్న విద్య పై తమకు నమ్మకం లేనట్లే కదా ! అంటే తమపై తమకు
నమ్మకంలేనట్లే కదా !!                                                                                                                             ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి
తల్లి దండ్రుల నిరక్షరాశ్యత నిరాసక్తత కూడా కారణమే
ఇన్నేండ్ల స్వతంత్ర భారతావని లో గ్రామీణ ప్రాంతాలు
కనీసం నలభై శాతం అక్షరాశ్యతకు కూడా నోచు కో లేదు . ప్రముఖకారణం పేదరికం.
నిరంతర జీవన పోరాటం . రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి . తాగుడు
మొదలైన దురల వాట్లు . అపరి శుభ్ర పరిస్థితులు . అనారోగ్యాలు .
ఈ దుర్భర పరిస్థితుల నుండి  తమను తాము ఉధ్ధరించు
కొంటే తప్ప బయట పడ లేని దుస్థితి .
అనాదిగా ఇటువంటి దుస్థితి లోనేపడి , అలవాటుపడి , బయటపడడానికి చేత కాని
అజ్ణానం లో పడి కొట్టు మిట్టాడు తున్న గ్రామీణ భారతాన్ని                                              చైతన్యం చేయడానికి  చదువొక్కటే మార్గం .
 నిద్ర లేవంగానే  పిల్లలకు ఇంత కలో గంజో పోసి ,
కూలి నాలి కెల్లి , సాయంత్రానికి ఇల్లు చేరుకొనే గ్రామీణ నిరు పేదలకు  తమ
పిల్లలు బడికెల్తున్నారో, బజారున పడుతున్నారో , చదువుతున్నారో , బలాదూర్
తిరుగు తున్నారో తెలుసుకొనే తీరికెక్కడిది  ?  ఓపికెక్కడిది ?
అసలు వీళ్లకు తమపిల్లల విద్యాబుద్దుల పట్ల
నిరాసక్తత సహజం గానే ఉంది . పిల్లలుకూడా దారి తప్పి , వీళ్ల మాట సుతరామూ
వినక పోవడమూ అచట కనిపించే సహజ వాతా వరణం . పాఠశాలలకు సక్రమంగా వెళ్లరు .
వెళ్లి నా చదువు పై గురి కుదరదు.   ధ్యాస అసలే ఉడదు . అక్కడ వీళ్లను
పట్టించు కొనే వాళ్లస లుండరు . ప్రైమరీ తోనో , ఆరేడు తరగతులతోనో
మానేస్తారు .
షరా మామూలే . కాస్త వయస్సు రాగానే
పెద్దలలాగానే కూలి నాలి . మళ్లీ అదే బ్రదుకులు
అవే పరిస్థితులు .
మరి వాళ్ల తరపున వాళ్ల పిల్లల తరపున వకాల్తా
పుచ్చుకొనే వాళ్లేరి ? తమను తాము ఉధ్ధరించుకో లేని వీళ్లను ఉధ్ధరించే
బాధ్యత తీసుకొనే దెవ్వరు ?
మరి , ఎనభై శాతం ఉన్న గ్రామీణ భారతం ఉధ్ధరింప
బడని నాడు - అది చేసాం ఇదిచేసాం అని కాగితాలపై ప్రగతి సూచికల
గణాంకాల  నివేదికలు ప్రకటించుకొనే ఈ ప్రభుత్వాలు ఈ నగ్న సత్యాలకు
జవాబు దారీ వహించ వలసిన అవసరం లేదా ?
విద్యార్ధులను విద్యాసక్తులను చేయడానికి తగిన మెకానిజం లేదు
ఉన్న వాళ్ల పిల్లల తల్లి దండ్రులు విద్యా వంతులు కావడం వల్ల
సహజం గా వాళ్ల లో విద్యాసక్తత ఏర్పడి ఉంటుంది . ఆ కుటుంబాలలో తదనుగుణమైన
పరిస్థితులూ ఆ వాతావరణమూ ఉంటుంది . వాళ్లు చది వే పాఠశాలలలోని
సహాధ్యాయులుకూడా విద్యాసక్తత గల కుటుంబాల నుండి వచ్చిన వారైనందువల్ల
వాళ్ల తో పోటీ పడే స్థాయి ఏర్పడి ఉంటుంది . డబ్బు ఖర్చు చేసి చదివించే
ధనవంతుల బిడ్డలవడంవల్ల వాళ్లు చదివే కార్పోరేట్ విద్యా సంస్థలలో
విద్యాసక్తత పెంచే అనేక ఆధునిక వసతులుంటాయి .
వీటన్నిటి కంటే బాల్యంనుంచే తల్లి దండ్రులు
తమ పిల్లలకు ఉన్నతస్ఠితులు అందుకోవాలనే సంకల్పాలను గట్టిగా ఏర్పరచి
ఉంటారు . సదరు సంకల్పాలకు అనుగుణంగా ఆయా ఊహలలో విద్యాసక్తతలు
ఏర్పరచుకొంటారు . ర్యాంకులు సాధించి తదనురూప ఉన్నతస్థితులు అందుకొంటారు .
గ్రామీణ పేదల పిల్లల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది .
తల్లి దండ్రులు నిరక్ష రాశ్యులు . తమ పిల్లల ఉన్నత స్థితుల పై కోరికలు
అంతర్లీనంగా ఉండవచ్చునేమోగాని ఆ స్థితి గతులు తమకు లేనే లేవనే
నైరాశ్యం కోరికలకు అడ్డుకట్ట వేస్తుంది . నిరక్షరాశ్యులు కావడం వల్ల
తమకే లేని విద్యాసక్తిని  తమపిల్లల కేర్పరచ లేరు .
ఈ పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలు ,
 అందులోని అర గొర వసతులు వీళ్ళలో విద్యాసక్తత ఏర్పరిచే స్థాయిలో
లేవని కరాఖండిగా చెప్పవచ్చు . ఇందుకు బాధ్యతవహించ డానికి సుతరామూ
ఇష్టపడని ప్రభుత్వాలకూ , అందులోపనిచేసే ఉపాధ్యాయ సత్తములకూ వీళ్లపట్ల అంతగొప్ప అనురాగా
లుంటాయని అనుకోవడం అత్యాశే అవుతుంది .
కాబట్టి పేదల పిల్లలను పాఠశాలలో
చేర్పించ డానికి గాని , వారికి విద్యాసక్తులేర్పరచడానికిగానీ , వారు
పాఠశాలలలో కొనసాగడానికిగానీ , భవిష్యత్ లో వారికి ఉన్నత స్థితు
లేర్పడడానికి అవకాశా లేర్పరచడంలో గానీ తప్పని సరిగా తగిన మెకానిజం
ఉండి తీరాలి . అప్పుడే సమాజం లో బడుగుల ధనికుల మధ్య అంతరాలు కాస్తైనా
తగ్గి శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది .
విద్యా సదుపాయాల కల్పన లో ప్రభుత్వాల బాధ్యత
విద్యా సదుపాయాల కల్పనలో ప్రభుత్వాల బాధ్యత
గణనీయమైన ప్రాధాన్యత సంత రించు కొని ఉంది . జాతీయాదాయం లో అధిక శాతం విద్యా సదుపాయాల
కోసం ఖర్చు చేసే ప్రభుత్వాలు విజ్ఞత గల ప్రభుత్వాలు .
విద్యా వనరులు ఎక్కువగా ఉన్న దేశాల లోని ప్రజలు ఎక్కువ శాతం
విద్యా వంతులౌ తారు . విద్యా వంతులున్న సమాజం లోని ప్రజలు తమ సమస్య లకు
తామే చక్కని పరిష్కారాలు చూసుకో గల్గుతారు . అలాంటి దేశాలు అభి వృధ్ధి
పధంలో దూసుకు పోతాయి . ఆ దేశాల లోని ప్రభుత్వాలకు అవినీతి , ఆశ్రిత పక్ష
పాతం , లంచగొండితనాల మీద పోరాడ వలసిన అవసరం ఉండదు . అక్కడ ఉగ్రవాదం ,
వేర్పాటువాదం , హత్యలు , దోపిడీలు, అంటురోగాల వ్యాప్తి అనే సమస్య
లుండవు . ప్రభుత్వాలు సజావుగా నడుస్తాయి . వ్యవసాయ , పారిశ్రామిక
ఉత్పత్తులు పెరుగు తాయి. జాతీయాదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తుంది .
ఇదంతా విద్యవల్ల ఏర్పడే బహుళ ప్రయోజనం .
మరి ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు గుర్తిస్తున్నాయి ?
. " విద్యాశాఖ పద్దు క్రింద ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం . ఖర్చు తప్ప
ఈశాఖ లో ఆదాయం కంపించడం లేదు " అని గతంలో ఒక మంత్రి మహోదయులు
సెలవిచ్చారంటే మన ప్రభుత్వాలను నడిపే ప్రబుధ్ధులు ఎంతటి విద్యాసక్తి
గలవారో , వారిలోగల ప్రజాసేవా భావం ఏపాటిదో , ఎంత తల్లకిందులుగా
కార్యమగ్నమై ఉందో కీర్తించ వలసిందే .
దేశ ప్రజలంతా విద్యా వంతులైతే డబ్బు తీసుకొని ఓటెయ్యరు
కదా ! సారా పొట్లాలనూ , బిర్యానీ పొట్లాలనూ దరి దాపుల్లోకి రానియ్యరు కదా !
 విద్యా వంతు లైన ప్రజల పై ప్రలోభాలు పనిచెయ్యవు . వారికేమి కావాలో చేయ
గల్గిన ప్రభుత్వాలనే నిక్కచ్చిగా ఎన్నుకొంటారు . రౌడీ రాజ కీయాలకూ , గూండా
ప్రభుత్వాలకూ చెల్లు చీటీ పడుతుంది మరి !
నూటికినూరుశాతం విద్యా వంత మైన సమాజం ఏర్పడడానికి ప్రభుత్వ పరంగా
ఏమేమి చేయాలి ?
కనీసం ఇంటర్ మీడియట్ స్థాయి వరకు ఒకే ఒక ప్రభుత్వ సెక్టార్ లోనే
విద్యాలయాలు నిర్వహింప బడాలి . విద్యాలయాలు రెసిడెన్షియల్ విధానంలో సకల
సదుపాయాలు కల్గిన " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులు " గా తీర్చి దిద్ద బడాలి .
అంటే పిల్లవాడు నర్సరీ లో " ఎడ్యుకేషనల్ కాంప్లెక్సులో
అడుగుపెడితే ఇక ఇంటితో , తల్లి దండ్రు ల తో సంబంధం లేకుండా అక్కడే
పెరిగి పెద్దవాడై విద్యాబుధ్ధులతో ఇంటర్ పూర్తిచేసుకొని , మంచి మూర్తిమత్వం
రూపు దిద్దుకొని ,  ప్రయోజకుడై బయటి ప్రపంచములోకి రావాలి. దీని కోసం
తల్లిదండ్రులనుండి ఒక్కరూపాయి కూడా వసూలుచేయరాదు , పేద ,  ధనిక తేడా లుండ రాదు.
 పెద్ద పంచాయితీ లైతే ఒకటి , చిన్న పంచాయితీలు రెండు మూడింటికి కలిపి
ఒకటి చొప్పున జనాభా ప్రాతి పదికన కాంప్లెక్సులు  ఏర్పాటుచేయ వచ్చు . ఖర్చు
విషయానికి వస్తే విద్యా శాఖలో ఒక్కో ఊళ్లో మెయిన్ స్కూలు , హెచ్ సి , జి
సి , నాన్ ఫార్మల్ , హైస్కూలు , ఆర్ బీ సీ , ఎయిడెడ్ , ఇంకా ఇంకా అనేకానేక
దండుగ మారి దుకాణాలన్నీమూసేసి ఆ నిధులను విని యోగించ వచ్చు . అదేవిధంగా
సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ మొదలైన అవినీతిమయ హాస్టల్ల అవసరం ఉండదు .
 ఇప్పుడు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాలయాల అవసరంలేదు .  ఇలా
విద్యా శాఖ నంతా ఒక కొలిక్కితెచ్చి ప్రభుత్వాలు పిల్లల నందర్నీ దత్తత
తీసుకొని ఇంటర్ వరకూ చదివించే బాధ్యత తీసుకొంటే అటు తర్వాత ఏర్పడ బోయే
సమాజాన్ని ఊహించుకొంటే ఎంత ఆనందం కల్గుతుందో గదా !