సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, జులై 2014, శనివారం

లోకోత్తర పురుషు లందరూ లోకారాధ్యులే



మానవుని దృష్టి పరిమితం .
మానవుని మేథస్సు పరిమితం .
మానవుని శక్తి పరిమితం .
మానవుని జీవితం పరిమితం .

అందుకే తన శక్తి  కంటే అపరిమిత శక్తి వైపు ఊహ మొదలైంది .
ఊహ నుండి శోథన మొదలైంది .
ఫలితంగా భగవద్భావన మొదలైంది .
తన కంటే శక్తి సంపన్నులైన లోకోత్తర పురుషుల ఆరాథన మొదలైంది .
ఈ భూమి పై జన్మించిన ఆ లోకోత్తరులే-
మానవ జాతి నుథ్థరించిన మహాను భావులైనందున –
వారే భగవంతుని ప్రతిరూపాలుగా భావింప బడినారు .

వారి లోకోత్తర జీవితాలు పరిసమాప్తమైనా –
వారి నామ సంకీర్తనల , పూజనల , ఆరాథనల ద్వారా –
తమ జీవితాలు సాఫీగా సాగుతా యనే అపరిమిత విశ్వాసం ఏర్పడింది .

ప్రబలమైన ఈనమ్మకం వల్లనే –
లోకోత్తర పురుషులంతా లోకారాథ్యులైనారు .
మతమేదైనా మహిమాన్వితులైనారు .
వారు చూపిన త్రోవలు జీవన మార్గాలైనవి .
సత్యం , థర్మం , ప్రేమ , దయ , అహింస , పరోపకారం –
అన్ని మతాలలో ప్రతిపాదింప బడి –
సందేశాలై మానవాళికి సర్వదా ఆచరణీయాంశాలైనవి .

వివిథ దేశాలలో , వివిథ కాలాలలో అవతరించి –
మానవాళి మనుగడకు దిశా నిర్దేశం చేసి , ఉథ్థరించిన –
జీసస్ , మహమ్మదు , కృష్ణుడు , రాముడు , బుథ్థుడు , శిరిడి సాయి  మొదలైన
లోకోత్తరులు సర్వదా లోకారాధ్యులు . 
వారి జయంతులు మానవాళికందరికీ పర్వదినాలు .
ఆయా దినాలలో  ఆయా మతస్థులు ఆనందంగా –
పండుగ సంబరాలు జరుపు కుంటున్నారు .

ఐతే ,
లోకోత్తర పురుషులంతా –
మతాతీతంగా –
మానవ జాతి కంతటికీ ఆరాథ్యులు .
మానవ జాతి నుథ్థరించిన  మహాను భావులందరి యెడల –
కృతజ్ఞతలు తెలుపు కుందాం .
ప్రతి మహానుభావుని జయంతినీ స్మరించు కుందాం .
లోకారాథ్యు లందరికీ ప్రణామా లర్పిద్దాం .
మానవులంతా ఒకటేనని చాటుదాం . 

కుల , మత , దేశ , కాల – సంకుచిత తత్త్వాలతో
జాతి సమైక్యతను నిర్వీర్యం చేయడానికి
ఎత్తుగడలు రచించే మహానుభావుల యెడల
అప్రమత్తులమౌదాం .






 

3, జులై 2014, గురువారం

THE LADDER (ఇది ఒక నిచ్చెన గారి అంతరంగం )



                నమస్తే సార్ !” అంటూ వచ్చి నేల చూపులు చూస్తూ నిలబడ్డారు, పది పన్నెండు మంది యెడ పిల్లలు .
అంతా పదిహేడు పద్దెనిమిదేళ్ళ వయసులో ఉన్న యువకులు .
ఏమిట్రా ఇలా వచ్చారు, అంతా కులాసాయేనా     ప్రేమగా పలుకరించాడు హెడ్మాష్టరు సారు .
                 అది మే నెల . స్కూళ్లకూ , కాలేజీలకూ వేసవి సెలవలు . ఐనా , పాఠశాల ప్రధానోపాధ్యాయుడూ , గుమాస్తా , అటెండరూ రోజూ వచ్చి , టపాలు చూచుకుని , వాటికి సమాధానాలు పంపడం , అవసరమైన పిల్లలకు టీసీలు ,
స్టడీ సర్టిఫికేట్లూ వగైరాలు ఇవ్వడం , అటెస్టేషన్లు చేసి పంపడం చేస్తుంటారు .
               వచ్చిన పిల్లలంతా ఆవూరి వాళ్లే . అందులో కొంత మంది అదే స్కూల్లో పది దాకా చదువుకొన్న వాళ్ళే .
తమ వద్ద చదువుకున్నవాళ్లు మళ్ళీ కనిపించి పలకరించి నమస్కరిస్తే , అదేమిటో ఈ టీచర్లు ఏనుగు నెక్కేస్తారు .
ఇదీ వొక రకమైన బలహీనతే నేమో !
           ఆ రామానాయుడు గారబ్బాయి చూచావూ , మనోహర్ , ఇప్పుడు జిల్లా కలెక్టరు , నేనే వాడికి మేద్స్ నేర్పించింది .
           ఇలా పదే పదే చెప్పుకుని మరీ మురిసి పోతుంటారీ బడుగు జీవులు . తనమీదనుంచి మెట్లెక్కి ఎందరో పైపైకి  పోతున్నా , ఇసుమంతైనా అసూయ పడడు సరికదా , పైపెచ్చు వాళ్లను చూచి మురిసి పోతూ , నేలపైనే
ఉంటాడు , నిచ్చెన లాగా .  ఎంత వెర్రిబాగులోడో కదా !
          సార్ వచ్చే ఆది వారం ఫ్రెండ్లీ మేచుందండీ , మీరు పర్మిషనిస్తే , మన గ్రౌండ్ లో  ప్రాక్టీస్ చేసుకుందాం అన్నారు
అబ్బాయిలు మొహాలు దీనంగా పెట్టి , అయ్యగారి విషయం తెలుసు కాబట్టి , అనుమతిస్తాడో లోదో అనే
అనుమానంతో .
           సెలవులేగా , ఏం ఫర్లేదు , ప్రాక్టీసు చేసుకోండి నిక్షేపంగా అని ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరించి
యోగ క్షేమాలు విచారించాడు పెద్దయ్యవారు .
ఏరా ఆనంద్ ఏం చేస్తున్నావ్
బీటెక్ ఫస్టియర్ సార్
తులసీ నువ్వేం చేస్తున్నావ్
నేను కూడా బీటెక్ ఫస్టియర్ సార్ అదే కాలేజీలో
నువ్వురా కాశీ
నేను మెడిసిన్ లో జాయినయ్యాన్ సార్
విశ్వేశ్వర్
టీటీసీలో చేరా సార్
         మిగతా వాళ్లు ఏమి చేస్తున్నదీ తెలుసు కాబట్టి ప్రశ్నించ లేదు వాళ్లను . వాళ్ళను అలా చూచి నప్పుడల్లా సారుకి
కొంచెం బాధ .
విశ్వేశ్వర్ బ్రామ్మడు , ఆనంద్ కూడా ఉన్నత వర్గాలకు చెందిన వాడు .
తులసీ , కాశీ ఉద్యోగస్తుల పిల్లలు . ఎస్సీ వర్గం .
రవి , నరిసింహులు , శీను , మరియన్న , పెంచలయ్య వగైరాలు మిగిల వాళ్ళు .
రవి , నరిసింహులు , మరియన్న , పెంచలయ్య ఎస్సీ వర్గం . శీను వగైరాలు బీసీ వర్గం .
వీళ్ల వరకూ సదరు హైస్కూల్లోనే పది వరకు చదివి , ముగించి కూలి పనుల కెల్తున్నారు .
ఫ్రెండ్సంతా కలుసు కోవడంతో సరదాగా క్రికెట్ మాచ్ పెట్టుకున్నారు . పిల్లలంతా గ్రౌండ్ లో కెళ్లారు .
           సారు మాత్రం ఆలోచనలో పడ్డాడు ..........
ఇంజనీర్లూ , ఢాక్టర్లూ కాలేక పోయినా – వీళ్ళు కూడా కనీసం చిన్న చిన్న ఉద్యోగాల్లో నైనా స్థిరపడి ఉంటే
తరతరాలుగా ఈ కూలి బతుకులు తప్పేవిగా .
         కానీ పాపం వీళ్ళకు రిజర్వేషన్ లున్నా వాటి ఫలాలు అనుభవించే అవకాశాలు అస్సలు లేవు గదా .
రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవితాలు . కాస్త వయస్సు కొచ్చారంటే కూలి కెల్లాల్సిందే , కడుపు నింపు
కోడానికి . ఇంకెక్కడి రిజర్వేషన్లు . ఇలా సాగుతోంది , నిచ్చెన గారి అంతరంగం .........
          దలిత వర్గాల రిజర్వేషన్ ఫలాలు , ఆ వర్గాలలో కొందరికే పరిమిత మౌతున్నవి . ఆర్థికంగా నిలదొక్కుకొని
ఉండడం వల్ల , తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల పిల్లలకు అన్ని అవకాశాలూ కలిసి
వచ్చి , ఉన్నత చదువులలో గానీ , ఉద్యోగాలలో గానీ  వీళ్లే రిజర్వోషన్ల ఫలాలు అంది పుచ్చుకో గల్గుతున్నారు .
ఉద్యోగాలలో స్థిరపడి , ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల పిల్లలతో , కూలి నాలి చేసుకుంటూ పూట గడుపు
కునే వారి పిల్లలు చదువులో పోటీపడి రిజర్వేషన్ ఫలాలు పొంద గలగడం సాధ్యమయ్యే పనేనా .
           ఆర్థికంగా వెసులుబాటు లేక , దిన దినం బతుకు పోరాటంలో మ్రగ్గి పోతున్న గ్రామీణ భారతం లోని
తొంబై శాతం పైగా ధళితులు తరతరాలుగా కూలి బతుకులు బతక వలసిందేనా . వీళ్ళకు రాజ్యాంగ పరంగా
సంక్రమించిన రిజర్వేషన్ ఫలాలు అంది పుచ్చు కునే మార్గమే లేదా .
        ఉంది . ఒకసారి రిజర్వేషన్ పరంగా ఉద్యోగం పొందిన కుటుంబాన్ని , రిజర్వేషన్ పరిధి నుంచి ఎలిమినేట్
చేసి , జనరల్ పరిధిలోకి మార్చాలి . ఇలా , ప్రభుత్వ , ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్లద్వారా
లబ్ధి పొందిన కుటుంబాలను మళ్లీ రజర్వేషన్ కోటాలోకి ప్రవేసించనీయరాదు . రిజర్వుడు స్థానాలలో
పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ పధ్ధతి అమలు చేయాలి .
     ఇలా చేస్తే , అందరికీ వాటంతట అవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి . అందరూ ఆర్ధికంగా నిల
దొక్కుకుంటారు . ఆర్ధికంగా నిల దొక్కుకున్న కుటుంబాలు సామాజికంగా అభి వృధ్ది చెందుతాయనటంలో
సందేహంలేదు .
          .......... ఇలా సాగిపోతోంది , ఆ పెద్ద సారు మస్తిష్కంలో ఆలోచనా తరంగాలు . ఐనా ఈ నిచ్చెన గారికి
ఎంతసేపటికీ సమాజాన్ని గురించిన ఆలోచనే గాని , అందులో పది శాతమైనా , సొంత కుటుంబం
గురించి ఆలోచన చేయ గలిగితే , ఈ నిచ్చెన నేల మీదే ఉండదు గదా . ఏమిటో ! ఈ వెర్రి బాగుల వాళ్లంతా ఇంతే నేమో!  


29, జూన్ 2014, ఆదివారం

సాయి నాధ్ మహా రాజుకు జయము జయము



భక్తికి నిలయమై పరిఢవిల్లిన భూమి
జ్ఞానాగ్ని రగిలిన కర్మ భూమి
గురు బోధనామృత ఝరులు పారిన భూమి
తత్త్వ వేత్తల యరుదైన భూమి
పరమ హంసల దివ్య పాదముద్రల భూమి
పావన నదుల సంపదల భూమి
వివిధ సంస్కృతులతో వెల్గులీనెడు భూమి
భిన్న మతాల సంపన్న భూమి

అట్టి భారత భూమిపై పుట్టిన ఘను
లెందరో కలరు , వారిలో మంది కొఱకు
బ్రతికి మార్గ దర్శకుడైన పరమ గురుడు
సాయి నాధ్ మహా రాజుకు జయము జయము

ముక్కోటి దేవతల్  భూదేవతల చేత
బందియై చీకటి మందిరాల
వెల వెల బోవగా వెలసె సాయిగ సర్వ  
దేవతా సత్తాక దివ్య మూర్తి
ముక్కోటి దైవాల కొక్కటే రూపమై
అరుదైన దైవమై యవతరించె
సాయి కృష్ణా యన్న, సాయి రామా యన్న
సాయీశ్వరా యన్న కాయు ప్రభుడు

సాయి రారా యని పిలువ చేయి సాచి
అందుకొని అండగా నిల్చు నతడు గాక
ఇంక వేరెవ్వరయ్య ధ్యానించి కొలువ
సర్వమూ సాయి మయము విశ్వాసమున్న

తర తమ భేదాలు తారసిల్ల వచట
తరియింతు రతని పాదాలు తాకి
కుల మత భేదాల కుమ్ములాటలు లేవు
ప్రణుతింతు రతని హారతులు పాడి
ఆగమ శాస్త్రాల అడ్డు గోడలు లేవు
పరవసింతు రతని భక్తి యందు
ఆదరించుటె కాని  చీదరింపులు లేవు
అరుదేర నతని మందిరము లందు

అతడె శ్రీ సాయి ప్రభు డరుదైన గురువు
తాకి తలిచేటి దైవమ్ము దరికి గాక
తొలుగు దూరము దూర మంచలుగు వారి
పంచ చేరంగ వెఱ్ఱులా ప్రజలు నేడు .