సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

3, అక్టోబర్ 2015, శనివారం

మృతులు జీవింతు రీ భూమి మీద మరల




గిరి , తరు , ఝరీ పరీత ప్రకృతిమయ మయి ,
కడు మనోఙ్ఞమై , సూర్య సంకాశ మైన       
పుడమి యందాలు వీక్షించు పుణ్య మరసి
మనకు కన్నుల నొసగెను మాధవుండు
 
సకల జగతిని వీక్షించు శక్తి గలిగి
చూచి గుర్తించు ఙ్ఞాన విస్ఫూర్తి గలిగి
తనర ప్రాణుల కానంద దాయకమయి
గ్రాలు సర్వేంద్రియ ప్రధానాలు – “ కళ్ళు

పుట్టు గ్రుడ్డులే గాక , యీ పుడమి మీద
పలు ప్రమాదాలు , రోగాల బడుట వలన
కళ్లు  గోల్పోయి అంధులై గనలు వారు
కటిక చీకటిన్ బ్రతుకుట గాంచి కూడ ....
 
మార్గ ముండియు  చైతన్య మబ్బకునికి
మరణ శయ్యకు జేరిన మనుజ వరుల
కళ్ళు మరణించు చున్నవి గాని ,   పూని
నేత్ర దానమ్ము జేసిన     నిలుచును గద !
 
మనిషి మరణించినను ,   కళ్ళు బ్రతికి ,     మరొక
మనుజునకు   చూపొసగి ,    అట్టి మనిషి వలన
మరల లోకాన్ని గనును ,  “ సమ్మతి యొసంగ ,
మానవత్వము వెల్లువై మహి వెలుగును .
 
ముందు చూపున్న మనుజులు పుణ్య ఫలము
నమ్మి ,  నేత్ర దానమ్మియ్య సమ్మతించి  ,
అంధులకు చూపు నొసగుదు  రమరు లయ్యు ,
మృతులు జీవింతు రీ భూమి మీద మరల .

 

 

 

 

 

28, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓం నమో శ్రీ సాయి నాధాయ



తలకు గట్టిన గుడ్డ  యిలకు రక్షగ నిల్చి

తరగని ప్రేమకు తావిడంగ

నిడు పాటి నుదుటిపై  నెలకొన్న తేజమ్ము

చేతులు జోడించు చిత్తమొసగ

అర్థ నిమీలితమై  యలౌకిక తపో

మగ్నమౌ కన్నులు మనసు దోచ

మంగళాకరములౌ మహనీయ పాదముల్

తాకి కళ్ళద్దుకో తలపు దోప

సాయి నాధుండు ద్వారకా మాయి వెలసి

సకల ప్రాణుల తోడుగా సాక్షి యగుచు

వాడ వాడల కొలువుండి వరదు డగుట

పుడమి భారతి చేసిన పుణ్య ఫలము .



శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ


             హితబోధ చేసిన హితు డితండు

రెండు రూపాయల దండి దక్షిణ గొని

             కష్టాలు బాపిన ఇష్ట సఖుడు

రోగార్తులను తాకి  రుజ బాధలను బాపి

            తాననుభవించిన త్యాగ మూర్తి

' సాయి ! కాపాడ  రారా  ' యన్న తక్షణ

            మాదుకొను కరుణామయు డితండు


సర్వ దేవతా సత్తాక సద్గురుండు

సాయి నాధుని  శరణంచు శరణు వేడి

చరణములు తాకి తరియింత్రు సకల జనులు

శరణు శరణంచు వేడితి సాయి !   రార .